|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సౌందర్యపోషణ
చర్మ సంరక్షణకు
చిన్నారుల సున్నిత చర్మాన్ని సంరక్షించడానికి ఆలివ్నూనె సుగుణాలతో తయారైన డాయ్ సరికొత్త సబ్బుల శ్రేణిని మార్కెట్లో విడుదల చేశారు.
చర్మం పట్టులా మెరవాలంటే బాదం, పచ్చి కొబ్బరి పేస్టు, ఒక్క టేబుల్ స్పూను చొప్పున, కొద్దిగా టమాటా పేస్టు తీసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి నాలుగైదు చుక్కల ఆలివ్ నూనె, తేనె కూడా చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్లా వేసుకుని బాగా ఆరిన తరువాత కడిగేసుకోవాలి.
చర్మం పై పేరుకున్న దుమ్ము ధూళి తొలగిపోయి పరిశుభ్రంగా ఉండటమే కాదు, ప్రత్యేక మెరుపు సంతరించుకోవాలంటే ఇలా చేసి చూడండి. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టికి, టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. ముఖానికి, మెడకు ప్యాక్లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండుసార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్కు కూడా ఎంతో సహకరిస్తుంది.
ఖరీదైన స్కిన్ టోనర్లకు బదులుగా చర్మానికి నిమ్మకాయ రసాన్ని వాడండి.
చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖనికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంద్రాలు శుభ్రపడతాయి.
తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది.
దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది.
నారింజ రసం తీసుకోండి. దానికి పాలు కలిపి ముఖానికి చేతులకు పట్టించండి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మచ్చలు, చర్మ సంబంధ సమస్యలు మాయమవుతాయి.
పద్నాలుగేళ్ళ వయసులో వారు ఎండలో వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ వాడటం, గొడుగు, టోపీ వాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ వయసు నుంచి ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూను పాలపొడి, రెండు స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపి మిశ్రమంగా తయారుచేసి మొహానికి రాసుకొని ఆరే వరకు అలాగే ఉంచుకొని తరువాత గోరువెచ్చని నీటితో మొఖాన్ని కడిగేయాలి. దీనివల్ల చర్మం బాగా శుభ్ర్రపడటమే కాక రక్తప్రసరణ మెరుగవుతుంది.
పావుకప్పు ఓట్లు, పాలపొడి, చిక్కటి గంజి తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా కలుపుకోవాలి. స్నానానికి ఇరవై నిముషాలముందు శరీరమంతా పట్టించుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
పోషక విలువలున్న ఆహార పదార్ధాలతో సమతుల ఆహారం తీసుకుంటే అది చర్మానికి అందాన్ని ప్రసాదించడమే కాకుండా అనేక చర్మసంబంధిత వ్యాధులకు గురికాకుండా రక్షిస్తుంది.
మరీ వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
మాయిశ్చరైజర్ ఉన్న సబ్బును వాడాలి. స్నానం చేసిన అనంతరం మాయిశ్చరైజ్ లోషన్ను పూసుకుంటే చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.
మీ చర్మం ముడతలు, పగుళ్ళు గా ఉన్నట్లయితే మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవాలి.
మొదట ఒక మంచి చర్మ వ్యాధుల నిపుణుని కలవండి. మీకున్న సమస్య చిన్నదేనా లేదా ప్రమాదకరమైనదా అనేది నిర్ధారించుకోవాలి. క్రమం తప్పకుండా ఫేషియల్స్, క్లీనప్స్ చేయించుకుంటుంటే మంచిగా చర్మాన్ని సంరక్షించుకోవాలి.
వారాని కొక్కసారి తప్పనిసరిగా నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.
వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి.
వెల్లుల్లి రసం తెగిన, కాలిన గాయలను, మచ్చలను తగ్గిస్తుంది.
శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం చేయడం కూడా చర్మసౌందర్యానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం.
ఆస్ట్రిజంట్: దీనిని జిడ్డుచర్మం కలవాళ్ళు ఉపయోగించాలి. ఆస్ట్రిజంట్ వాడితే చర్మంలో ఉన్న నూనె శాతం తగ్గి తాజా అనుభూతి కలుగుతుంది.
కాలమైన్లోషన్: దీనిని అన్ని కాలాల్లో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో చర్మాన్ని ఎండబారి నుండి రక్షిస్తుంది.
సాధారణ చర్మం: ఈ చర్మం కలవారు గంధంతో కూడిన సబ్బులు, లావెండర్ సబ్బులు వాడాలి.
పొడి చర్మం అయితే ఇలా చేయాలి
ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని పండబారిన టమోటాలతో రుద్దితే బాధ తొలగడంతో పాటు చర్మం మెత్తబడుతుంది.
ఎప్పుడూ కాటన్ దగ్గర పెట్టుకొని ముఖాన్ని తుడుచుకుంటూ ఉండాలి. లేదంటే బ్యాక్టీరియా చాలా తొందరగా ఈ చర్మం పై చేరుతుంది. వయసు ప్రభావం వల్ల, చర్మం పలుచదనం వల్ల తొందరగా సూర్యకిరణాల తాకిడికి, పొగకు, కాలుష్యానికి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొడిచర్మం ఉన్నవారిలో లోపల ఉన్న తేమకూడా త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి అలాంటి చర్మం కలవారు వెంటనే మాయిశ్చరైజ్ చేయించుకోవాలి.
కాచిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
నూనె, నీరు కొన్ని ఇతర ఔషధాలు కలిపిన ద్రవపదార్ధంతో మాయిశ్చరైజ్ చేసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ సంరక్షణలో ప్రధాన పాత్రను పోషిస్తూ ముడుతలు, పొడిబారటం, మంట, పగుళ్ళు లేకుండా చేయడంతోపాటు చర్మానికి ఒక ఆరోగ్యమైన సహజసిద్దమైన మెరుపును అందిస్తుంది.
పెరుగులో బియ్యం పిండిని కలిపి స్నానం చేస్తే శరీరం పగుళ్లు, పొడిబారటం తగ్గి కాంతివంతంగా మారుతుంది.
పొడి చర్మం ఉన్న వాళ్ళు కొన్నాళ్ళ పాటు రోజూ రాత్రి పూట ఆముదంతో చర్మాన్ని మర్ధన చేసుకుంటే చర్మం క్రమంగా మృదువుగా మారుతుంది.
పొడిచర్మం: ఈ చర్మం కలవారు గ్లిజరిన్తో కూడిన సబ్బులు వాడాలి.
మాయిశ్చరైజర్: దీనిని పొడి, సాధారణ చర్మం గల వాళ్ళు వాడాలి. చర్మం ముడతలు పడటాన్ని నిరోధించి, చర్మ మృదుత్వాన్ని కాపాడుతుంది.
రాత్రిళ్ళు స్నానం చేశాక మాయిశ్చరైజర్ తీసుకుని చర్మంలోకి బాగా ఇంకేలా మర్దన చేయాలి. అలా చేస్తే నిద్ర పోయేటప్పుడు రక్త సరఫరా బాగా జరిగి తెల్లారేసరికి చర్మం తేటగా ఉంటుంది.
వాక్సింగ్ అనంతరం బాడీ లోషన్ లేదంటే అలోవెరా జెల్ రాసుకోవాలి. అందులోని సహజ కూలింగ్లక్షణం చర్మాన్ని సేదదీరుస్తుంది.
చర్మం కోసం తినండివి...
సమతులాహారలో కీలకపాత్ర వహించే పండ్లు, కూరగాయల వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. చర్మ సౌందర్యం ఇనుమడించాలంటే కొన్నిరకాల కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.
తాజా నిమ్మరసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. రక్తం శుద్ధి అవుతుంది. మలబద్ధక, కాలేయసంబంధ సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. 'సి' విటమిన్ సమృద్ధిగా లభించి చర్మం కొత్త కాంతులీనుతుంది.
వయసు పెరిగే కొద్దీ చర్మం వదులుగా అవుతుంది. వార్ధక్యపు ఛాయలు కనిపిస్తాయి. ఈ సమస్యకు పాలకూరలోని విటమిన్ 'ఇ', క్యారెట్లోని విటమిన్ 'ఏ' తో పాటు యాంటీ ఆక్సీడెంట్లు చక్కని పరిష్కారం అందుకే వీటిని తరచూ తీసుకోవాలి.
ఫోలిక్యాసిడ్, జింక్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వాడి రక్తప్రసరణ చురుగ్గాసాగేలా చేస్తాయి.
దేహంలోని మలినాలను తొలిగించడంలో కీరదోస పాత్ర కీలకం.
విటమిన్ 'సి' తోపాటు ఇనుము సమృద్ధిగా లభించే పుదీనా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇవే కాకుండా బత్తాయి, క్యారెట్, అల్లం, తేనెతో తయారుచేసే రసాలు చర్మానికి మేలు చేస్తాయి. బత్తాయి రోగనిరోధక శక్తిని పెంచితే, అల్లం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం తేటగా తయారౌతుంది.
ఈ ప్యాక్లు... ఎంతోమేలు
చర్మంపై పేరుకునే మృతకణాలు తొలిగించడానికి మీరెలాంటి ప్యాకులు వేసుకుంటున్నారు? ఈసారి వీటిని ప్రయత్నించి చూడండి. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
నారింజ తొక్కల పొడి, శనగపిండితో కలిపివేసుకునే ప్యాక్ మృతకణాలు నివారించడానికి సరైన పరిష్కారం.
తేనే, పాలు సమపాళ్లలో కలిపి చర్మనికి రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత కడిగేయాలి.
చిన్న క్యారెట్ ముక్కను మెత్తగా నూరుకుని నేరుగా.. లేదంటే కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకూ ప్యాక్లా వేసుకోవాలి.
బాదంపలుకులు, ఓట్స్ సమపాళ్లలో తీసుకుని మిక్సీలో వేయాలి, ఆ పొడిని సీసాలో భధ్రపరచుకోవాలి, వారానికోసారి కాస్త పొడిని తేనెతో కలిపి ముఖానికి మరియు మెడకూ పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
విటమిన్ 'ఇ' క్యాప్సూల్ ను మధ్యకు విరవాలి. తేనే, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకుని దీనికి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిసాల తర్వాత కడిగేసుకోవాలి.
చలికి సన్స్ర్కీన్!
చలిగాలులు వీస్తున్నాయి, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఈ చలి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది.అందుకే ఈ జాగ్రత్తలు...
శీతాకాలంలో మరీ వేడినీటితో స్నానం చేయకూడదు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా గోరు వెచ్చని నీరు శ్రేయస్కరం. మరీ వేడినీరు చర్మంలోని సహజ నూనెలు ఆవిరయ్యేలా చేస్తుంది. ఫలితంగా చర్మం పొడి బారి జీవం కోల్పోయినట్లు తయారౌతుంది.
గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మీవల్ల కాదనుకుంటే కనీసం ఆ వేడి నీటికి నాణ్యమైన నూనె ఏదైనా కలపవచ్చు. చర్మానికి మృదుత్వం వస్తుంది.
ఈ కాలంలో హెర్బల్ సబ్బులు వాడకం శ్రేయస్కరం. డిటర్జెంట్ సబ్బులను అదే పనిగా వాడితే చర్మం పొడిబారిపోతుంది.
స్నానం చేశాక చర్మం తడి పొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
సన్స్ర్కీన్ లోషన్లు వేసవికే పరిమితమనుకుంటారు చాలామంది. అది ఖచ్చితం కాదు. చలికాలంలో కూడా చర్మం పై అతినీలలోహిత కిరణాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుకే బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా పగలు తప్పనిసరిగా నాణ్యమైన సన్స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి. చివరిగా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశమేంటంటే... చర్మ సంరక్షణ కోసం మీరు వాడుతున్న ఏ ఉత్పత్తి కూడా అవసరానికి మించి ఉపయోగించకూడదు. అది కూడా చర్మానికి హాని చేస్తుంది మరి.
చర్మానికీ మెరుగు...
మెరుగు పెడితే చీరలు, నగల మాదిరిగానే చర్మం కూడా మెరుస్తుంది. దీన్నే సౌందర్య పరిభాషలో "బాడీపాలిషింగ్" అంటారు. ఇది అందం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. చర్మం మీద పేరుకుపోయే మృతకణాలను ఈ ప్రక్రియ సమూలంగా తొలగిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో శరీరంలో రక్త ప్రసరణ చరుగ్గా ఉండదు. దాంతో చర్మం రంగు తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో సహజంగా నీళ్ల్లు తక్కువగా తాగుతారు కాబట్టి మలినపదార్ధాలు కొంతమేరకు శరీరంలోనే మిగిలిపోతాయి. ఇది కూడా రంగు తగ్గడానికి కారణమవుతుంది. చర్మం పగిలి పలు చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇంక ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి. దీనివల్ల హర్మోన్ల సమతూకం దెబ్బతింటుంది. వీటన్నింటికీ బాడీపాలిషింగ్ ఒక చక్కని పరిష్కారం.
ప్రయోజనాలు
మృతకణాలు పూర్తిగా తొలగిపోతాయి. మర్దన చేస్తాం కాబట్టి రక్తప్రసరణ మెరుగవుతుంది. ఆక్సిజన్ని సమృద్దిగా అందుతుంది.
బాడీ పాలిషింగ్ వల్ల లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అలా శరీరం నుంచి మలినాలన్నీ వెలుపలకి పోతాయి.
సెల్యూలైట్ సమస్య ఎక్కువ ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా బాడీపాలిషింగ్ చేయించుకుంటే చర్మం పట్టులా మృదువుగా తయారవుతుంది.
కణాలు పునరుత్తేజమై చర్మం యవ్వన కాంతితో మెరుస్తుంది.
కండరాలు సేదతీరుతాయి. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే గృహిణులు, ఉద్యోగినులు, ముఖ్యంగా ఏసీ గదుల్లో గడిపేవారికి బాడీపాలిషింగ్ అందంతో పాటు చక్కని ఉపశమనాన్నీ ఇస్తుంది.
క్లినిక్లో ఇలా...
250 మి.లీ. హెల్త్ డ్రింక్ శరీరం నుంచి మలినాలను సులువుగా వెలుపలికి పంపేందుకు దోహదం చేస్తుంది.
కాక్టస్, సీ లీడ్, బొప్పాయి, సీసాల్ట్ కలిపిన మిశ్రమంతో పది నిమిషాలు ఫ్రిక్షన్ మసాజ్ (మృతకణాల తొలగింపు) చేస్తాం.
ఐదు, పది నిమిషాల సేపు ఆవిరి పడతాం.
మీ చర్మతత్వానికి సరిపడే ఆరోమా ఆయిల్ కలిపిన క్రీమ్తో మసాజ్ ఉంటుంది.
గర్బిణుల కోసం ప్రత్యేకంగా మాండరిన్ ఆయిల్ బేస్ట్ క్రీమ్ వాడతాం.
హార్మోన్ల సమస్య ఉన్నవారికి జెర్నిపెర్ ఆయిల్ బేస్ట్ క్రీమ్ వాడతాం.
ఒత్తిడి, ఆందోళన ఎక్కువ ఉన్నవారికి జెర్నియమ్ ఆయిల్ బేస్ట్ క్రీమ్తో మర్దన మంచి ఉపయోగం ఉంటుంది.
గ్రీన్, బ్రౌన్ క్లే, ఆర్గానిక్ మిల్క్, రోజ్వాటర్, సోయా నూనె కలిపిన మిశ్రమంతో బాడీప్యాక్ వేస్తాం. దీనివల్ల చర్మం మీద ముడతలు చాలా వరకు తగ్గుతాయి.
చివరిగా స్పెషల్ బాత్ పౌడర్తో (తులసి, గంధం, కర్జూరాలు, శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, రోజాపూల సుగుణాలను మేళవించి చేసినది) చర్మాన్ని సంతరించుకుంటుంది.
అవగాహన ఉందా?
పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి మాయిశ్చరైజింగ్ మాస్కులు. చర్మంలో తేమ శాతాన్ని పెంచుతాయి. పొడి మచ్చలను మటుమాయం చేసి ముడతలు రాకుండా కాపాడుతాయి. త్వరితగతిన ఫలితాన్నిచ్చే ఈ మాస్క్ లను చర్మం కాస్త గట్టిగా ఉండి, పొడిబారినట్లు అనిపించినా వేసుకోవడం మరచిపోవద్దు.
చర్మంపై పేరుకున్న అధిక జిడ్డు, మలినాలను తొలగిస్తాయి. క్లే, మడ్ మాస్క్లు జిడ్డు చర్మం వారికి మేలు చేస్తాయి. చర్మం తాజాగా, పరిశుభ్రంగా ఉంటుంది.
ఒక్కోసారి మృత కణాలు పేరుకుపోయి కొందరి చర్మతత్వం దెబ్బతింటుంది. అంతే కాదు బ్లాక్ హెడ్స్ బాధిస్తాయి. అటువంటి వారికోసమే ఎక్స్ ఫోలియేటింగ్ మాస్క్. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మృతకణాలను తొలగించి తాజాగా ఉంచుతుంది ఈ మాస్క్.
సులువుగా వేసుకోగలిగే పీల్ ఆఫ్ మాస్క్లు అన్నిరకాల చర్మతత్వాల వారికీ మేలు చేస్తాయి. జెల్లా ఉండే మాస్క్ ఆరిన వెంటనే ఇట్టే తొలగించవచ్చు. జిడ్డు సమస్యా ఉండదు.
జెల్ మాస్క్ కూడా సులువుగా వేసుకోవచ్చు. ఇది సున్నిత, జిడ్డు చర్మాల వారికీ సులువుగా నప్పుతుంది. చర్మాన్ని మృధువుగా , కోమలంగా ఉంచుతుంది .
ఈ విషయాలు గుర్తుంచుకోండి.
వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కసారి చర్మ స్వభావం మారవచ్చు. ఉదాహరణకు వేసవిలో జిడ్డు ఉండే చర్మం శీతాకాలంలో పొడి బారుతుంది. అందుకే కొనే ముందు ఈ విషయం మరచిపోకూడదు.
ముఖాన్ని పరిశుభ్రంగా కడుకున్న తర్వాతే మాస్క్ వేసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోండి.
చాలా మాస్క్ లు చర్మంపై గరిష్టంగా పదిహేను నిమిషాలకు మించి ఉంచకూడదు. అందుకని వేసుకునే ముందే ప్యాక్లపై రాసిన నిబంధనలన్నింటినీ ఒకసారి చదవండి .
ఒకవేళ మీది కాంబినేషన్ చర్మతత్వం అయితే నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
ఏ కారణం చేతైనా ఎలర్జీ వస్తే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in