|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
రత్నాలు
అన్ని
విషయాల్లోనూ ఎప్పుడూ ఉత్సాగంగా ఉల్లాసంగా ఉండే వ్యక్తిని "జెం" అంటారు సాధరణంగా.
"జెం" అంటే "రత్నం" లేదా "జాతి రాయి" అని తెలుగులో అర్ధం. రత్నం అంటే గొప్పదని కూడా
మరో అర్ధం. మంచి వాళ్ళని కూడా రత్నాలతో పోలుస్తారు. విశ్వవిఖ్యాత ఎన్.టి.రామారావు
గారికి "నట రత్న" అనే బిరుదు ఉంది. అంటే నటులలో రత్నంలా ప్రకాశించేవాడని అర్ధం.
ఇంకా ముఖ్యంగా మన దేశ అత్యున్నత పురస్కారమైన అవార్డు "భారతరత్న". అంటే భారతదేశానికే
రత్నం వంటివాడని అర్ధం. రత్నానికి ఎంత ప్రాముఖ్యముందో ఈ అవార్డులనుబట్టి
తెలుస్తోంది. ఈ రత్నాల గురించి తెలిపే శాస్త్రాన్ని "జెమాలజి" అంటారు. విద్యా
రంగంలో కూడా నేడు ఇదో ప్రత్యేక విభాగం. వ్యాపార సంబంధంగా ఇది అభివృద్ధి
పొందినప్పటికీ విజ్ఞాన శాస్త్రంలో ఇది అద్భుత విజయంగా పరిగణించబడుతోంది. ప్రపంచంలో
లభిస్తున్న ఈ అమూల్య రత్నాలలో 90 శాతం ఖనిజ సంబంధమైనవి. మానవులకు ఆభరణాల మీద ఉన్న
మోజు అనాదినుంచీ వస్తున్నదే. పౌరాణిక యుగం నుంచీ వీటిపట్ల మోజు తక్కువేమీ కాదు.
వీటికోసం యుద్ధాలు జరిగిన సందర్భాలు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి.
సుమారు
లక్ష సంవత్సరాల క్రితమే లైం స్టోన్ క్వార్త్జ్తో పూసలు చేసి ధరించేవారు. ప్రాచీన
కాలంనుంచి జెం స్టోన్స్ (మెరిసే మణులు) ఉపయోగం ఈజిప్టు, గ్రీసు, రోము దేశాలలో
ఎక్కువగా ఉండేది. ఖనిజ సంబంధమైనవేగాక జంతు సంబంధమైన ముత్యం, దంతం, పగడం, వృక్ష
సంబంధమైన ఆంబరు, జెట్ మొదలైన వాటిని కూడా వాడేవారు. క్రీస్తుపూర్వం నుంచీ రత్నాలు,
మణులు వాడుకలో ఉన్నాయి. అతి ప్రాచీనమైన సిరియా, ఈజిప్టు స్మశాన వాటికలలో వీటి
దృష్టాంతాలు చాలా కనిపించాయి. ఈ రత్నాలు, మణుల గురించి మూఢ నమ్మకాలు, పిచ్చి భ్రమలు
అనేకం ప్రచారంలో ఉన్నాయి. అంతే కాకుండా వాటికి ఔషధ గుణాలు, మాంత్రిక శక్తులు
ఉన్నాయని కూడా భావిస్తారు. గ్రీకు దేశస్థులు రక్షగా ఎర్రరాతి తాయెత్తును
ధరించేవారు. పాండు రోగానికి స్ఫటిక రక్షలు ఉపయోగించేవారు. చింతామణి వంటి గ్రీన్
సర్పంటైన్ సాధారణంగా పాముకాట్లకు ఉపయోగించేవారు. టొపాజ్ (గోమేధికం, పుష్యరాగం) పొడి
చేసి వైన్లో కలిపి త్రాగి ఉత్తేజాన్ని పొందేవారు. తెల్లగా ఉండి సప్త వర్ణాలను
ప్రసరించే ఓపల్ చెట్టు ఆకులో పెట్టి పట్టుకుంటే మనిషి ఇతరులకు కనిపించకుండా
సంచరించవచ్చని నమ్మేవారు. ఈవిధంగా వీటి గురించి అనేక కట్టుకథలు ఉన్నాయి. వజ్రాలు
కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
వాటి
అపురూపతనుబట్టే వాటి విలువ ఏర్పడుతుంది. ముఖ్యంగా వీటి వర్ణ విన్యాసం వల్ల,
పారదర్శిక స్వభావం వల్ల, అపురూత వల్ల వీటికి విలువ ఏర్పడుతుంది. వివిధ వర్ణాలు
ప్రసరించేట్టు మణులను తయారుచేయడం ఒక ప్రత్యేక కళ. దానిని లాపిడ్రే అంటారు. ఎక్కువ
కాంతితో ధగధగ మెరిసేట్టు బహుముఖాలుగా చెక్కడానికి వీటిని ఏక, ద్వి, త్రిముఖాలుగా
కోస్తారు. వీటికి వివిధ గుణాలు, తత్వాలు, స్త్రీ పురుష జాతులు, అధిదేవతలు, గ్రహాలు
కూడా ఏర్పరిచారు. పూర్వం డైమండ్ (వజ్రం), రూబీ (మాణిక్యం), సఫైర్ (నీలం), ఎమరాల్డ్
(మరకతం), ఓపల్ (విమలకం) మాత్రమే అమూల్య రత్నాలుగా విభజించారు. ఒక్క విమలకం తప్ప
మిగిలిన రకాలన్నిటినీ కృత్రిమంగా తయారుచేస్తున్నారు. భౌతిక, రసాయనిక లక్షణాలనుబట్టి
పరిశీలిస్తే కృత్రిమంగా తయారుచేసేవాటికి, సహజమైన రత్నాలకు భేదం కనిపించదు.
భారతదేశంలో డైమండ్ (వజ్రం), లాపిస్ లాజులి లైక క్యాట్స్ ఐ (వైఢూర్యం), అగేట్
(గోమేధికం), టొపాజ్ (పుష్యరాగం), సఫైర్ (నీలం), ఎమరాల్డ్ (మరకతం), రూబి (మాణిక్యం),
కోరల్ (విద్రుమం), పెరల్ (ముత్యం) అనే నవ రత్నాలు చాలా ప్రసిద్ధమైనవి.
నవరత్నాలు
ధరిస్తే అపజయం ఉండదనే నమ్మకం అనేకమందిలో ఉంది. ఆ నమ్మకంతోనే కొందరు నవ రత్నాలనూ ఒకే
ఉంగరంలో కూర్చి ధరిస్తూ ఉంటారు. రత్న శాస్త్రాన్ని అభ్యసించిన కొందరు దీనినే జీవన
భృతిగా ఎంచుకుని స్థిరపడుతున్నారు. ఏ రాయి ధరిస్తే దేని మీద దాని ప్రభావం ఎంతగా
ఉంటుందో వారికి జాతకాలనుబట్టి వీరు చెబుతుంటారు. నిరాశా నిస్పృహలకు లోనైనవారు,
వ్యాపారంలో కలసిరానివారు, వయసు మీద పడుతున్నా వివాహం కానివారూ ... ఇలా ఒక్కొక్కరు
ఒక్కో సమస్య వల్ల ఈ రత్నాలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఈ నమ్మకాలను
కొట్టిపారేస్తున్నా వీటిని నమ్ముతున్న వారే ఎక్కువ. ఏదేమైనా అమూల్యాభరణాలుగా వీటి
స్థానం మాత్రం అత్యంత విలువైనదని చెప్పక తప్పదు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in